Valmikipuram : జూలై 29 నుండి 31వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జూలై 29 నుండి 31వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. జూలై 29న సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూలై 30వ తేదీన ఉదయం యాగశాల పూజ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్సేవ, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.
జూలై 31న ఉదయం యాగశాల పూజ, ఉదయం 6.30 గంటలకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.