Pavitrotsavam : ఆగస్టు 24 నుండి 26వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగస్టు 24 నుండి 26వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఆగస్టు 24వ తేదీ ఉదయం చతుష్టానార్చన, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం పవిత్రహోమం, నివేదన, శాత్తుమొర జరుగనున్నాయి. ఆగస్టు 25న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 26న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షన, సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్ల ఊరేగింపు నిర్వహించనున్నారు.