Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, బలిహరణ,శాత్తుమొర, నివేదన, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ , ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.