తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎంపీ పార్థసారథి., సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సుమ దంపతులు మీడియాతో మాట్లాడుతూ స్వామి వారి దర్శనం బాగా జరిగిందని స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు వేసవి సెలవులు మరో 5 రోజుల్లో ముగియనున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి దర్శనం 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని 72,174 మంది భక్తులు దర్శించుకోగా 35,192 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.