పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.
తిరుమలలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు. తె.4.30 నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 10రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. అటు శ్రీశైలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెలుపలికి తీసుకొచ్చి రావణ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి వేళ పుష్పార్చన నిర్వహించనున్నారు.
ముర అనే రాక్షసుడితో పీడింపబడే దేవతలంతా మహావిష్ణువును ప్రార్థిస్తారు. దీంతో మురతో యుద్ధం చేస్తూ ఆయన సింహవతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు. స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుంది. విష్ణువు సంతోషించి వరం కోరుకోవాలని అడగగా, ఇవాళ ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలిగించమని ఆమె కోరుతుంది. స్వామి తథాస్తు అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్తాడు. అలా వైకుంఠ ఏకాదశి అయింది.