తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మంగళవారం రాత్రి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు బోర్డు సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్తో మాట్లాడుతూ అన్నప్రసాదంలో అందిస్తున్న అన్నం చాలా మృదువుగా, వంటకాలు రుచికరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా రాత్రి భోజనంలో వడను వడ్డించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు. అన్నప్రసాద వితరణ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్, భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఎల్లప్పుడూ రుచికరమైన అన్నప్రసాదాన్ని అందించేలా నిరంతరం పరిశుభ్రతతో కూడిన వంటకాలను సిద్ధం చేసి అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి జానకీ దేవిలు కూడా చైర్మన్ తో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈ వో శ్రీ రాజేంద్రకుమార్ కూడా ఉన్నారు.