పాన్ కార్డు అప్ డేట్ చేయకపోతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. కస్టమర్ పాన్ కార్డు అప్ డేట్ కాకపోతే.. వారి పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా 24గంటల్లోగా బ్లాక్ అవుతోం దంటూ కొందరు ఫేక్ మెసేజ్లు పెడుతున్నారని తెలిపింది. ఇలాంటి నకిలీ మెసేజ్లు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ట్విట్టర్ లో పోస్టు పెట్టింది.‘‘ఐపీపీబీకి సంబంధించి వస్తోన్న ప్రచారంలో నిజంలేదు. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఎప్పుడూ ఇలాంటి సందేశాలను పంపదు. మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. నకిలీ లింక్ల పట్ల జాగ్రత్త’’ అని కోరింది. ఏదైనా వార్తను నమ్మడం, వేరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధ్రువీకరించుకోవాలని అధికారులు పదే పదే సూచిస్తున్న విషయం తెలిసిందే.