Group-4 Certificates Verification : నేటి నుంచి గ్రూప్-4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నేటి నుంచి గ్రూప్-4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆగస్టు 21వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్టికెట్ నంబర్ల వారీగా వెరిఫికేషన్ తేదీలను వెబ్సైట్ లో పేర్కొంది.
నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్గార్డెన్లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ప్రతిరోజూ ఉదయం, మధాహ్నం వేళల్లో పరిశీలన జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల గైర్హాజరైన వారు, ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇవ్వనివారు.. ఉంటే అటువంటి వారి కోసం ఆగస్టు 24, 27, 31 తేదీలను రిజర్వుడేగా టీజీపీఎస్సీ ప్రకటించించింది.
ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5గంటల తర్వాత వెరిఫికేషన్కు అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి డా.నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. మరోవైపు గ్రూప్-2 దరఖాస్తుల వివరాల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ముగియనుంది. రాష్ట్రంలో 8,180 గ్రూపు-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పరీక్షలను నిర్వహించి, వాటి ఫలితాలను కూడా ప్రకటించారు.