భారత ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రసుత్తం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మనోజ్ పాండే ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దాంతో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా ఉన్నారు. 30న కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపేంద్ర ద్వివేది ఇప్పటికే పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం అందుకున్నారు. 1964లో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది డిసెంబర్ 15, 1984న భారత సైన్యంలోని పదాతిదళ రెజిమెంట్ జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ లో నియమితులయ్యారు.
తన 40 సంవత్సరాల సేవలో ఉపేంద్ర అనేక రకాల బాధ్యతలను నిర్వర్తించారు. 2022 నుండి 2024 వరకు నార్తర్న్ కమాండ్ కు డైరెక్టర్ జనరల్ ఇన్ ఫ్రాంట్రీ, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ సహా ముఖ్యమైన పదవులను నిర్వహించారు. లెఫ్టినెంట్ ఉపేంద్ర ద్వివేది రేవా సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, యూఎస్ ఆర్మీ వార్ కాలేజీల్లో చదివారు. డీఎస్ ఎస్సీ వెల్లింగ్టన్, ఆర్మీ వార్ కాలేజ్, మోవ్లో కూడా కోర్సులు చేశారు.