Mumbai-Pune Highway : భారీ ట్రాఫిక్ జామ్ .. అంబులెన్స్లోనే పోయిన ప్రాణం!
మహారాష్ట్రలోని ముంబయి సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్లో ఉన్న ఒక మహిళ సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ముంబై-పూణె జాతీయ రహదారిపై ములూండ్ టోల్ప్లాజా సమీపంలో సోమవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీని కారణంగా అంబులెన్స్ కదలిక నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్ను తొలగించడానికి పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది తగిన చర్యలు తీసుకోలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆంబులెన్స్కు దారి ఇవ్వడంలో వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని పలువురు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రజల నుంచి, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దుర్ఘటన ట్రాఫిక్ నిర్వహణలో ఉన్న లోపాలను మరియు అత్యవసర సేవలపై దాని ప్రభావాలను మరోసారి స్పష్టం చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై మృతురాలి భర్త కౌశిక్ మాట్లాడుతూ.. తన భార్య నాలుగు గంటల పాటు భరించలేని నొప్పితో విలవిలలాడటం చూశానన్నారు. రోడ్డు గుంతలమయంగా ఉందని.. అదే ఆమె బాధకు మరింత కారణమని వాపోయారు. నొప్పితో అరుస్తూ ఏడ్చిందని.. తొందరిగా ఆస్పత్రికి తీసుకెళ్లాని వేడుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేకపోయామన్నారు.