Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్కు అహ్మదాబాద్ ఆతిథ్యం
శతాబ్ది ఉత్సవాల వేళ భారత్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక గేమ్స్
2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ క్రీడలు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ కామన్వెల్త్ స్పోర్ట్ అహ్మదాబాద్ను కామన్వెల్త్ క్రీడల కోసం ఆతిథ్య నగరంగా సిఫారసు చేసింది. చివరిసారిగా 2010లో భారత్ ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ను నిర్వహించింది. రెండోసారి భారత్ 2030లో ఆతిథ్యం ఇవ్వబోతోంది.
2030 కామన్వెల్త్ గేమ్స్ క్రీడలు, సంస్కృతి, ఐక్యతకు గొప్ప వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక శక్తి, శక్తి సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశం ఉంది. భారత్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో కొత్త తరం అథ్లెట్లకు స్పూర్తినిస్తుంది.
ఇది వందో కామెన్వెల్త్ గేమ్స్ అవుతాయి. 2036లో భారత్ ఒలింపిక్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక ప్రారంభ కార్యక్రమంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు సంబంధించి, నవంబర్ 26, 2025న స్కాట్లాండ్లో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో ఆమోదం పొందవచ్చు.
భారత్ లో చివరి సారిగా ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఆ సమయంలో గేమ్స్ ప్రణాళిక లోపాలు, మౌలిక సదుపాయాల పూర్తి కాకపోవడం, అవినీతి ఆరోపణలు కారణంగా భారత ప్రతిష్ట మసగబారింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పీటి ఉషా ఈ 100వ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారత్కు గర్వకారణం అని అన్నారు.
2030 గేమ్స్ కోసం రూ. 825 కోట్లతో నిర్మించిన నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రధాన వేదికగా ఉండనుంది. ఈ కార్యక్రమానికి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయి పటేల్ ఎన్క్లేవ్, నరేంద్రమోడీ స్టేడియం వంటి వాటిని కూడా ఉపయోగిస్తారు.