యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నెలకొన్న ‘కలుషిత ఆహారం’ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సోమవారం విచారణ నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి ప్రశాంత్(12) ఈ నెల 13వ తేదీన కలుషిత ఆహారం తిని మృతి చెందడం, మరికొంతమంది విద్యార్థులు ఆస్పత్రుల పాలవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దీంతో ఈ ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ను భువనగిరికి పంపుతోంది. ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో అమరేందర్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికీ నలుగురు విద్యార్థులు హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీరాం శ్రీనివాస్ను అధికారులు సస్పెండ్ చేశారు. కలుషిత ఆహారం ఘటన నేపథ్యంలో వార్షిక పరీక్షలను వాయిదా వేయడంతో విద్యార్థులంతా రెండు రోజుల క్రితమే ఇళ్లకు వెళ్లిపోయారు.