కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆయన 45 గంటల దీక్ష ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయల్దేరనున్నారు.
పర్యటనలో భాగంగా 3000 మందికిపైగా పోలీసులను కన్యాకుమారి, వివేకనందా రాక్ మెమోరియల్ వద్ద మోహరించారు. తమిళనాడు తీర రక్షణ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మూడు రోజులపాటు చేపలవేటను నిషేధించారు. యాత్రికులను తనిఖీలు చేస్తున్నారు.
ఐదేళ్ల కిందట 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్నాథ్ సందర్శించారు. 2014లో ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్కు సంబంధించిన ప్రతాప్గఢ్కు వెళ్లారు. ప్రధాని ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం వెనుక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది.
దశాబ్దాల కిందట స్వామి వివేకానంద భారతమాత దర్శనం పొందిన ప్రదేశం కన్యాకుమారి. ఈ ప్రాంతం స్వామి వివేకానంద జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్ ఎంత ముఖ్యమైనదో.. స్వామి వివేకానంద జీవితంలో రాక్ మెమోరియల్ సైతం ప్రత్యేకమైంది.