MANIPUR: మణిపుర్ అల్లర్ల కేసులు అసోంకు బదిలీ
అన్ని కేసులు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు... గువాహటి హైకోర్టుకు కీలక సూచనలు....;
మణిపుర్ అల్లర్ల(Manipur violence )కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) దర్యాప్తు చేస్తోన్న కేసులను సుప్రీంకోర్టు( Supreme Court ) అసోం(Assam )కు బదిలీ చేసింది. ఇక నుంచి ఈ కేసుల విచారణ అసోంలోనే కొనసాగనుందని తెలిపింది. ఇందుకోసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులను ఎంపిక చేయాలని గువాహటి హైకోర్టు(Gauhati High Court )కు సూచించింది. మణిపుర్ హింసపై నమోదైన కేసులను స్థానికంగా కాకుండా పొరుగు రాష్ట్రంలో విచారించాలని కేంద్ర ప్రభుత్వం(central govt) చేసిన విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నిందితులను కోర్టుముందు హాజరు పరచడం, రిమాండు, జ్యుడీషియల్ కస్టడీ వంటివి ఇక నుంచి గువాహటిలో కేటాయించిన కోర్టు నుంచి ఆన్ లైన్ లోనే జరుగుతాయని పేర్కొంది.
మణిపూర్ హింసాకాండ కేసుల విచారణను ఇప్పటికే సీబీఐ ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. వీరిలో ఇద్దరు మహిళా డీఐజీ స్థాయి అధికారులు ఒక పురుష డీఐజీ స్థాయి అధికారి, ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో హింసాకాండ, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి సీబీఐ విచారణను ముమ్మరం చేసింది. మణిపూర్ లో మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన రెండు ముఖ్య కేసులతో సహా ఇప్పటివరకు మొత్తం ఎనిమిది కేసులను నమోదు చేసింది. మరిన్ని కేసులను నమోదు చేసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ముగ్గురు డిఐజిలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ రాజ్వీర్లతో కూడిన బృందం మొత్తం దర్యాప్తును పర్యవేక్షించే జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్కు నివేదిస్తారని సీబీఐ తెలిపింది. ఇంత పెద్ద సంఖ్యలో మహిళా అధికారులు ఏకకాలంలో విచారణ చేయటం ఇదే మొదటిసారి. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు,ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీసులు అందరూ మహిళలే. ఈ సీబీఐ బృందంలో 16 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు. మణిపుర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించామని సీబీఐ అధికారులు తెలిపారు.సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం 1989లోని నిబంధనల ప్రకారం లోనివేనని తెలుస్తోంది.
మే 3 న మణిపూర్ హైకోర్టు రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ అయిన మైతీలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తరువాత మే 3న మైతీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మంది( 160 people have been killed) చనిపోయారు.