మోదీ (Modi) నాయకత్వంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయన్నారు. ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించిందని విమర్శించారు. ఆ పార్టీ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని, ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని ఫైరయ్యారు. మోదీ సర్కారు గత నాలుగేళ్లుగా 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందిస్తోందని యోగి గుర్తు చేశారు. "ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సమస్య. ఆ పార్టీ పాలనలో ఎలాంటి కీలక నిర్ణయాలు లేవు. ఎలాంటి విధానాలు లేవు. జమ్మూకశ్మీర్పై కాంగ్రెస్ రుద్దిన ఆర్టికల్ 370ని శాశ్వతంగా రద్దు చేశాం. మోదీ నాయకత్వంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయి" అని సీఎం యోగి చెప్పుకొచ్చారు. ఇక మహమ్మారి కరోనా సమయంలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు కనిపించకుండా పోయాయని, మోదీ మాత్రం తన గురించి పట్టించుకోకుండా ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించారని ప్రశంసించారు.