పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అడ్డదారుల్లో ఆమె ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారంటూ పెద్ద ఎత్తున వస్తోన్న ఆరోపణలతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. పూజా ఖేడ్కర్ ట్రైనింగ్ను నిలుపుదల చేసి తిరిగి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం వంటి ఆరోపణలతో పూజా ఖేడ్కర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా ఖేడ్కర్ని రిలీవ్ చేస్తున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఓ ప్రటకనలో తెలిపింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కి ఆమె సమర్పించిన పలు ధ్రువీకరణ పత్రాలల్లో ఆమె దృష్టి లోపానికి సంబంధించిన అంశంపై దర్యాప్తు జరుగుతోంది. పూజా వ్యవహార శైలిపై ఆరోపణలు రావడంతో పుణె నుంచి వాసింకు బదిలీ చేశాక ఆమెపై తీసుకున్న తొలి పెద్ద చర్య ఇదే కావడం గమనార్హం.