ఢిల్లీలోని షహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో ఈ రోజు తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఊపిరాడక ఇద్దరు పిల్లలు, వివాహిత దంపతులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు మనోజ్ (30), అతని భార్య సుమన్ (28)తో పాటు ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలుగా గుర్తించారు.
"నలుగురు వ్యక్తులు -- ఇద్దరు పిల్లలు, ఒక వివాహిత జంట -- ఊపిరాడక మరణించినట్లు మాకు ఆసుపత్రి నుండి సమాచారం వచ్చింది. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఉదయం 5:20 గంటలకు షహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం గురించి పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రతిస్పందనగా, స్థానిక పోలీసు బృందం, నాలుగు ఫైర్ టెండర్లు, అంబులెన్స్లు, పిసిఆర్ వ్యాన్లతో వేగంగా సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు అధికారి తెలిపారు.
పార్కింగ్లో మంటలు చెలరేగాయి
మంటలు చెలరేగిన భవనంలో నాలుగు అంతస్తులు ఉన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ సౌకర్యం ఉందని పోలీసులు తెలిపారు. పార్కింగ్ స్థలంలో మంటలు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు, పొగ త్వరగా భవనం అంతటా వ్యాపించింది. "వీధి ఇరుకైనప్పటికీ, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పగలిగారు. ప్రతి అంతస్తులో శోధన నిర్వహించబడింది. ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలను హెడ్గేవార్ ఆసుపత్రికి పంపారు" అని అధికారి తెలిపారు.