టీమ్ ఇండియా క్రికెటర్ కృనాల్ పాండ్య మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య పంఖురి శర్మ ఈనెల 21న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘వయు’గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని కృనాల్ పాండ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది చూసిన ఫ్యాన్స్ పాండ్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమిండియా శిఖర్ ధావన్, దినేశ్ కార్తిక్లు కృనాల్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కృనాల్ పాండ్య ప్రముఖ మోడల్ అయిన పంఖురిని 2017లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2022 జూలై 24న కవిర్ జన్మించాడు. ఇక కృనాల్ సోదరుడు హార్దిక్ పాండ్యకు సైతం ఓ కొడుకు ఉన్నాడు. హార్దిక్-నటాషా దంపతుల కొడుకు పేరు ఆగస్త్య. కాగా కృనాల్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఐపీఎల్ 2024లో కృనాల్ లక్నో తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో అతడు 8 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు తీశాడు. కృనాల్ ఐదు ఇన్నింగ్స్ల్లో 58 పరుగులు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 43 పరుగులు. కృనాల్ ఇప్పటి వరకు 121 ఐపీఎల్ మ్యాచ్ల్లో 1572 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్ కెరీర్లో మొత్తంగా అతడు 75 వికెట్లు తీశాడు.