MS Dhoni : కెప్టెన్ కూల్.. ఇకపై ధోనీకే సొంతం!

Update: 2025-07-02 06:45 GMT

మైదానంలో కెప్టెన్ కూల్ గా కనిపించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు తన టైటిల్ ను ట్రేడ్ మార్క్ చేసుకునే పనిలో ఉన్నాడు. అభిమానులు ఆప్యాయంగా పిలిచే ‘‘కెప్టెన్ కూల్’’ అనే పదానికి ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తును ట్రేడ్‌మార్క్‌ల రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆమోదించింది. ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ప్రకారం.. ధోని దాఖలు చేసిన దరఖాస్తును ఆమోదించామని బోర్డు తెలిపింది. “కెప్టెన్ కూల్” అనే పేరు జూన్ 16, 2025న ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో అధికారికంగా ప్రచురించబడింది.

అంతకుముందు, ధోని "కెప్టెన్ కూల్" అనే ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, రిజిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ చట్టంలోని సెక్షన్ 11(1) కింద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ధోని తరఫు న్యాయవాదులు 'కెప్టెన్ కూల్' అనే పేరుతో ధోనీకి ప్రత్యేకమైన సంబంధం ఉందని వాదించారు. అభిమానులు, మీడియా ఎన్నో ఏళ్లుగా ధోనిని ఇలా పిలుస్తున్నారని..ధోని ప్రజా గుర్తింపులో భాగమని కూడా వాదించారు.

ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ, ధోనీకి 'కెప్టెన్ కూల్' బిరుదు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రాబోయే రోజుల్లో, 'కెప్టెన్ కూల్' మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే పరిమితం అవుతుంది. ఈ ట్యాగ్‌లైన్‌ను మరెవరూ ఉపయోగించలేరు.

కెప్టెన్ కూల్’ బ్రాండింగ్:

'కెప్టెన్ కూల్' అనే ట్యాగ్‌లైన్‌తో మహేంద్ర సింగ్ ధోని కొత్త బ్రాండింగ్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. దీని ప్రకారం, రాబోయే రోజుల్లో ధోని తన క్రీడా సంస్థలు, శిక్షణా కేంద్రాలు, బ్రాండెడ్ ఉత్పత్తులు వంటి వివిధ వ్యాపార కార్యకలాపాలకు ప్రత్యేకంగా కెప్టెన్ కూల్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. ఇది ధోని బ్రాండ్ విలువను మరింత పెంచే అవకాశం ఉంది.

Tags:    

Similar News