ఐఐపీఎల్ ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి విధించిన గడువు సమీపించింది. అక్టోబర్ 31 సాయంత్రం ఐదుగంటలలోపు ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్ట్ని సమర్పించాల్సి ఉంది. ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంచైజీలకు ఐపీఎల్ పాలకవర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కలిసి ఉంటుంది. దీంతో ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ముంబయి ఇండియన్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందో అంచనా వేశాడు. భజ్జీ చాలాకాలం పాటు ముంబయి తరఫున ఆడిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను ముంబయి అట్టిపెట్టుకుంటుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అయితే, మాజీ సారథి రోహిత్ శర్మను రిటైన్ చేసుకుంటుందా? లేదా అనే ప్రశ్న మిగిలి ఉందన్నాడు.