ENG vs ind: భారత బ్యాటర్ల తడ"బ్యాటు"
204 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్;
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న అయిదో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 204 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. వర్షం అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 123 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కరుణ్ నాయర్ కీలక అర్ధ శతకంతో భారత్ 204 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9 పరుగులకు ఔట్ కాగా.. కరుణ్ నాయర్ అజేయ అర్ధ శతకంతో భారత జట్టును ఆదుకున్నాడు. ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి అవుటయ్యాడు. కరుణ్ నాయర్ కు తోడుగా వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ కు దిగింది. అయితే మొదటి రోజు ఆట పూర్తికాకముందే భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మ్యాచ్కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 64 ఓవర్ల ఆట సాధ్యమైంది. కరుణ్ నాయర్ (52*; 98 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధశతకం చేశాడు. సాయి సుదర్శన్ (38; 108 బంతుల్లో 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. శుభ్మన్ గిల్ (21), ధ్రువ్ జురెల్ (19), కేఎల్ రాహుల్ (14), రవీంద్ర జడేజా (9), యశస్వి జైస్వాల్ (2) కూడా నిరాశపర్చారు. వాషింగ్టన్ సుందర్ (19 ) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ 2, జోష్ టంగ్ 2, క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.
గిల్ అనవసరంగా రనౌట్
టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ చేజేతులా రనౌట్ అయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి 21 పరుగులకే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 28 ఓవర్ లో అట్కిన్సన్ వేసిన రెండో బంతిని గిల్ డిఫెన్స్ ఆడాడు. బంతి ముందే ఉన్నా క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే బౌలింగ్ వేస్తూ సగం పిచ్ వద్దకు వచ్చిన అట్కిన్సన్ డైరెక్ట్ త్రో తో గిల్ ను రనౌట్ చేశాడు. తనని తానే రనౌట్ చేసుకున్నందుకు ఈ టీమిండియా కెప్టెన్ గ్రౌండ్ లోనే తీవ్ర నిరాశకు గురయ్యాడు. లేని పరుగు కోసం రన్ అనవసరంగా తీశాడని నెటిజన్స్ బాధపడుతున్నారు. ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ 21 పరుగులకే ఔట్ కావడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. గిల్ ఔట్ కావడంతో 83 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 737 పరుగులు చేసిన గిల్.. ఒకే టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా నిలిచాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ టీమిండియా కెప్టెన్ ఈ ఘనతను అందుకున్నాడు. 1979లో వెస్టిండీస్పై గవాస్కర్ 732 పరుగులు చేసిన రికార్డ్ ను బ్రేక్ చేసి టాప్ లోకి వెళ్ళాడు. టీమిండియా నాలుగు మార్పులతో మ్యాచ్ ఐదో టెస్ట్ ఆడుతుంది. జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో ప్రసిద్ కృష్ణ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ పై వేటు పడగా.. అతని స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్ తుది జట్టులోకి వచ్చాడు. పంత్ దూరం కావడంతో ధృవ్ జురెల్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. కంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ స్థానం సంపాదించాడు.