పల్లవి,స్పోర్ట్స్:టీమిండియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఫలితం తీవ్ర నిరాశకు గురిచేసిందని, తమ ప్రణాళికలను సరిగ్గా అమలుచేయలేకపోయామని దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సంజూ శాంసన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత బ్యాటర్ను అభినందించేందుకు తానేమీ మొహమాట పడటం లేదన్నాడు. ‘సంజూ శాంసన్ ఆట చాలా బాగుంది. మా బౌలర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేశాడు. అతడిని అడ్డుకొనే క్రమంలో మా ప్రణాళికలు గతి తప్పాయి. వచ్చే మ్యాచుల్లో కొత్త ప్లాన్స్తో వస్తాం. ఓవైపు క్రీజ్లో పాతుకుపోయి దూకుడుగా ఆడుతుంటే ఆపడం చాలా కష్టం. సంజు ఇన్నింగ్స్ను మనమంతా అభినందించాలి. మ్యాచ్కు ముందు ప్రణాళికలను ఎలా అమలు చేయాలనే దానిపై తీవ్రంగా చర్చించాం. ఎవరు డెత్ ఓవర్లను వేయాలనేది ఆలోచించుకున్నాం. సంజూ శాంసన్ భారీ హిట్టింగ్తో మిడిల్ ఓవర్లలో మేం అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాం. కానీ, చివరి నాలుగు ఓవర్లలో కోయిట్జీ, యాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను అడ్డుకోగలిగారు. కానీ, లక్ష్య ఛేదనలో మాకు సరైన ఆరంభం దక్కలేదు. అక్కడే మ్యాచ్లో వెనకబడిపోయాం. బౌలింగ్ పరంగా ఏ ఇబ్బంది లేదు. బ్యాటింగ్లోనే మేం చాలా మెరుగుకావాల్సి ఉంది. తప్పకుండా రెండో మ్యాచ్లోను పుంజుకుంటామని భావిస్తున్నా’ అని మార్క్రమ్ వెల్లడించాడు.