Srilanka vs Pakistan: 2వ టెస్టులో శ్రీలంక ఘోర పరాజయం, సిరీస్ పాక్ కైవసం
2వ టెస్టులో శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో స్వదేశంలో అత్యంత భారీ పరుగుల తేడాతో కూడా చెత్త రికార్డును నమోదు చేసుకుంది.
Srilanka vs Pakistan: పాకిస్థాన్ స్పిన్నర్ నయీం అలీ(7/70) ధాటికి శ్రీలంక జట్టు కుప్పకూలిపోయింది. 2వ టెస్టులో శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో స్వదేశంలో అత్యంత భారీ పరుగుల తేడాతో కూడా చెత్త రికార్డును నమోదు చేసుకుంది.ఈ మ్యాచ్ విజయంతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని పాకిస్థాన్ జట్టు 2-0తో కైవసం చేసుకుంది.
4వ రోజు ఆట ఆరంభించిన పాకిస్థాన్ జట్టు కేవలం 2 ఓవర్లు మాత్రమే ఆడి 576 పరుగుల వద్ద ఇన్నింగ్స్ని డిక్లేర్డ్ చేసింది. ఆట 2వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి రిజ్వాన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం డిక్లేర్డ్ చేశారు. దీంతో 510 పరుగుల భారీ ఆధిక్యాన్ని నమోదు చేసుకున్నారు.
2వ ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఓపెనర్లు మొదట పాక్ బౌలర్లను అలవోకగానే ఎదుర్కొన్నారు. 18 ఓవర్ల దాకా దాదాపు 4 పరుగుల రన్రేట్తో పరుగులు సాధించారు. 19వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నోమన్ అలీ మధుష్క(33)ని ఔట్ చేసి శ్రీలంక మొదటి వికెట్ తీశాడు.
లంచ్ నుంచి రాగానే 2వ ఓవర్లో కెప్టెన్ కరుణరత్నే(41) వికెట్ తీసి మరోసారి దెబ్బకొట్టాడు. తరువాత వచ్చిన బ్యాట్స్మెన్ వేగంగా పరుగులు చేసే క్రమంగా త్వరత్వరగా వికెట్లు కోల్పోయారు. కుశాల్ మెండిస్(14), చండిమాల్(1)లు వెనువెంటనే పెవిలియన్ చేరారు. ధనుంజయ డిసిల్వా(10) 131 పరుగుల వద్ద 5వ వికెట్గా వెనుదిరిగాడు. 2వ సెషన్లో 62 పరుగులు మాత్రమే చేసిన శ్రీలంక 5 వికెట్లను కోల్పోయింది. శ్రీలంక మొదటి 6 వికెట్లను నోమన్ అలీ ఖాతాలోనే పడటం విశేషం.
టీ తర్వాతి సెషన్లో నసీం షా బౌలింగ్ ఏంజెలో మాథ్యూస్(63) ఓ సారి, రమేష్ మెండిస్(16)లను అంపైర్ ఔట్గా ప్రకటించగా, బ్యాటింగ్ రివ్యూలో నాటౌట్గా రావడంతో బతికిపోయారు. 65వ ఓవర్లో రమేష్ మెండిస్ని స్టంపౌట్ చేసి నోమన్ అలీ శ్రీలంక మొత్తం 7 వికెట్లను తీశాడు. తర్వాత వరుస ఓవర్లలో నసీం షా మిగిలిన 3 వికెట్లను తీయడంతో శ్రీలంక జట్టు 188 పరుగులకు చాపచుట్టేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.