దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, సెలక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో భారత జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రుతురాజ్ విషయంలో పెద్ద ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి గైక్వాడ్ని మూడో ఓపెనర్గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఓపెనర్లుగా ఉన్న యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్కి బంగ్లాదేశ్ టీ20 సిరీస్కి విశ్రాంతి ఇచ్చినప్పటికీ గైక్వాడ్ని ఎంపిక చేయలేదనే విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత జట్టు మేనేజ్మెంట్, సెలక్టర్లు అతడిని ఆస్ట్రేలియా సిరీస్లో మూడో ఓపెనర్గా ఆడించాలనే ఆలోచనతో ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో రాణించాలంటే ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే బంగ్లా టీ20కి ఎంపిక చేయలేదు. ఇరానీ కప్లో మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు’ అని విశ్వసనీయవర్గం తెలిపింది. అయితే ఈ నెలలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్లోను అతడిని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.