దేశవాళీ, సీనియర్ స్థాయిలో అవినీతిని రూపుమాపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ను అవినీతి నిరోధక విభాగానికి కొత్త బాస్గా నియమించింది. ప్రస్తుతం ఏసీబీ అధిపతిగా ఉన్న ఐపీఎస్ కేకే మిశ్రా పదవీ కాలం ముగిసింది.ఆయన స్థానంలో కొత్తగా శరద్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 29న బెంగళూరులో జరిగిన బీసీసీఐ వార్షిక మీట్లో యాంటీ కరప్షన్ విభాగం హెడ్గా శరద్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శరద్ హర్యానా కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. వివిధ ప్రాంతాల్లో పలు హోదాల్లో పనిచేశారు. శరద్కు అతిపెద్ద ఆర్ధిక నేరాలకు చెందిన కేసులను దర్యాప్తు చేసిన అనుభవం ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు 2013 నుంచి 2017 వరకూ నాలుగేండ్లు బాస్గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర నిఘా సంస్థలో కమిషనర్గానూ పనిచేశారు. ముఖ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ముఠాలు, లెక్కలోకి రాని లావాదేవీలపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉండటంతో బీసీసీఐకి మంచిరోజులు వచ్చాయని క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి