కేరళ క్రికెట్ అసోసియేషన్(KCA)కు, మాజీ బౌలర్ శ్రీశాంత్కు మధ్య వివాదం ముదురుతోంది. విజయ్ హజారే ట్రోఫీకి కేరళ క్రికెట్ అసోసియేషన్ సంజూని సెలక్ట్ చేయకపోవడం వల్లే అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ దక్కలేదని శ్రీశాంత్ ఇటీవల ఆరోపించారు. ఆ ఆరోపణల్ని తిప్పికొట్టిన కేసీఏ, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచామని గుర్తుచేసింది. దానిపై స్పందించిన శ్రీశాంత్, తన పరువు తీసిన వారు తగిన జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కేసీఏ స్టేట్మెంట్ ఏంటంటే?
సంజు శాంసన్కు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో అవకాశం కల్పించకపోవడంపై భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అసహనం వ్యక్తంచేశాడు. ఇప్పుడదే కేరళ క్రికెట్ సంఘం నోటీసు జారీ చేయడానికి కారణమైంది. ‘‘శ్రీశాంత్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లినప్పుడు.. కేసీఏ అధికారులు అతడికి మద్దతుగా నిలిచారు. అప్పుడు క్రిమినల్ కేసును క్వాష్ చేయడంతో ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడ్డాడు. అప్పుడు మేం అతడికి సహాయమందించాం. కాబట్టి, ఇతర ప్లేయర్ల సంరక్షణ విషయం శ్రీశాంత్కు అవసరం లేదు’’ అని కేసీఏ ప్రకటనలో పేర్కొంది.