క్రికెట్ అభిమానులకు సండే డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. ఇవాళ ఒక్క రోజే.. భారత్ రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. టీమిండియా పురుషుల, మహిళల జట్లు వేర్వేరు జట్లతో తలపడునున్నాయి. యూఏఈ వేదికగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు భారత జట్టు దయాది పాకిస్థాన్ జట్టుతో ఢీకొనబోతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ మహిళల జట్టు.. ఈ మ్యాచ్ లో గెలిచిస్తే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే టోర్నీ నుంచి వైదొలిగే ప్రమాదం కూడా ఉంది. మరి టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
మరోవైపు, బంగ్లాదేశ్తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. ఇప్పుడు, టీ20 సిరీస్ పై కన్నేసింది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7 గంటలకు జరగనుంది. టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్వాలియర్ చేరుకున్న భారత్, బంగ్లా క్రికెటర్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. టెస్ట్ సిరీస్లో ఓడిన బంగ్లా, టీ20 సిరీస్ ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక, దాదాపు యువకులతో బరిలోకి దిగనున్న టీమిండియా.. టీ20 సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. టీ20 ఫార్మాట్ లో బంగ్లా జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ హోరాహోరీగా ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి.