ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha) మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. కవిత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఉదయం తీర్పును వెల్లడించింది.
ఈ తీర్పులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు. ఎమ్మెల్సీ కవిత తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయిన ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయనీ.. బెయిల్ ఇవ్వొద్దని కోర్టును ఈడీ అధికారులు కోరారు. ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అనీ.. అలాంటి ఆమె బయటకు వెళ్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల 4వ తేదీనే వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం సోమవారం వెలువరించింది. ఈడీ తరఫున న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి భవేజా బెయిల్ నిరాకరిస్తున్నట్లు తీర్పును వెల్లడించారు. ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కాం కేసులో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. తిహార్ జైలు నుంచి మంగళవారం మళ్లీ కోర్టుకు తీసుకొస్తారు. కవిత సాధారణ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20న మరోసారి వాదనలు జరగనున్నాయి.