తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ‘కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు’అని రేవంత్రెడ్డి సూచించారు.