తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదని సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. కేబినెట్ లో ఎవరెవరు ఉండాలనే దానిపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు. కసరత్తు కొనసాగుతోందని చెప్పారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అత్యవసరంగా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే యోచన తనకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. పీసీసీ కార్యవర్గం కూర్పు ఓ కొలిక్కి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యం అని చెప్పారు. రాహుల్ గాంధీతో తన అనుబంధం గురించి తెలియని వారు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కుల గణన ఆషామాషీగా చేసింది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. బీసీల జనాభా ఎక్కడా కూడా తగ్గలేదన్నారు. దాదాపు 5 శాతానికిపైగా పెరిగిందన్నారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కూడా త్వరలోనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.