తెలంగాణ (Telangana) నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) 2024 మార్చి 20వ తేదీ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై సౌందర రాజన్ రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాష్ట్ర బాధ్యతలు అదనంగా అప్పగించారు. తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా బాధ్యతలు అప్పగించారు.
ఇవాళ రాత్రి 9.10 గంటలకు రాంచీ నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు హైదరాబాద్ కు రానున్నారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్భవన్ వేదికగా కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు.
తమిళనాడులో బీజేపీలో సీనియర్ పొలిటీషియన్గా కొనసాగుతున్న రాధాకృష్ణన్ను గత ఏడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా రాష్ట్రపతి నియమించారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక అయ్యారు. 1957లో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తిరుపూర్లో రాధాకృష్ణన్ జన్మించారు.
టుటికోరియన్లోని వీఓసీ కాలేజ్ నుంచి వ్యాపార పరిపాలనలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. జనసంఘ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సీపీ రాధాకృష్ణన్. 1998, 199లో కోయంబత్తూరు లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు.