బీజేపీకి నేషనల్ ఫస్ట్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఫ్యామిలీ ఫస్ట్ అని వేములవాడ సభలో ప్రధాని మోదీ విమర్శించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలను అవినీతే కలుపుతోంది. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాపాడాలి. మాజీ ప్రధాని పీవీ నరసింహరావును కాంగ్రెస్ అవమానించింది. చివరికి ఆయన పార్థివదేహాన్ని తమ పార్టీ ఆఫీస్లోకి రానివ్వలేదు’ అని మోదీ మండిపడ్డారు.
వేములవాడ సభలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఇండియా కూటమికి పరాభవమే ఎదురైంది. మూడో ఫేజ్లో వారి ఫ్యూజ్ ఎగిరిపోయింది. మిగిలిన 4 విడతల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైంది’ అని మోదీ తెలిపారు.
కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు విచారణ జరపట్లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ‘అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా లేదు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడింది. ఇప్పుడు దర్యాప్తు చేయట్లేదు. ఓటుకు నోటు కేసులో చిక్కిన కాంగ్రెస్ నాయకులపై ఇప్పటివరకు దర్యాప్తు లేదు. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని మోదీ విమర్శించారు.