కల్నల్ సంతోష్బాబుకు దక్కనున్న అరుదైన గౌరవం?
సంతోష్ బాబుకు ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనునట్లు తెలుస్తోంది. సంతోష్ బాబుకు ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న దేశ రాజధానిలో నిర్వహించే వేడుకల సందర్భంగా సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అందజేస్తారని సమాచారం.
సైనిక పురస్కారాల్లో అత్యుత్తమైనది పరమవీర్ చక్ర, మహవీర్ చక్ర, వీర్ చక్ర ఉన్నాయి. శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పతాకాలు ఉన్నాయి. వీటిని అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులుగా భావిస్తారు.
గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు కల్నల్ సంతోష్ బాబు. 2020 జూన్ 15న లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈ ఘర్షణల్లో ఆయనతో పాటు 20 మంది అమరులు అయ్యారు. కొంతమంది సైనికులు గాయపడ్డారు.