గ్రేటర్ ఎన్నికలు.. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం
గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల సమర్పణ గడువు ముగియనుంది. దీంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. అటు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వీటిలో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 195 నామినేషన్లు దాఖలవగా.. బీజేపీ 140, కాంగ్రెస్ 68, ఎంఐఎం 27, టీడీపీ 47, వైసీపీ 1, సీపీఐ 1, సీపీఎం 4, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 15, స్వతంత్ర అభ్యర్థులు 110 మంది నుంచి నామినేషన్లు అందాయి. దీంతో ఇప్పటివరకు 537 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. నామినేషన్ల నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్లోకి అనుమతి ఇస్తున్నారు.