యువతకు ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పరిశ్రమలు,పెట్టుబడులు, ఉద్యోగాలు సాధ్యమని చెప్పారు. హైదరాబాద్ను ప్రశాంతంగా పచ్చటి పొదరిల్లుగా కాపాడుకున్నామని అన్నారు. బీజేపీ నేతలు ఉద్వేగాలు రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున అల్వాల్లో రోడ్ షో నిర్వహించారు. బీజేపీ నేతల మాటలు నమ్మవద్దని సూచించారు.
ఆరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందరికీ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రోజు విడిచి రోజు నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నుంచి నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఆరేళ్లలో ఏం చేశారంటే వంద పనులు చూపిస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు.