వాతావరణ హెచ్చరిక రాజకీయ పార్టీలకు గుబులు రేపుతోంది. తెలంగాణలో పోలింగ్ రోజు మే13న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ అంచనా వేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోక్సభ ఎన్నికలతో పాటు పోలింగ్ రోజు మే 13న రాష్ట్రం మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో వేడిగాలుల పరిస్థితుల కారణంగా భారత ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక గంట పొడిగించింది. IMD హైదరాబాద్ తాజా అంచనా ప్రకారం.. సోమవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
మండే ఎండలు ఉంటాయనుకున్న టైంలో.. వానలు పడుతుండటంతో.. అధికారులు కూడా పరిస్థితిని అంచనావేయలేకపోతున్నారు. వర్షం లేకుండా వాతావరణం చల్లగా ఉంటే చాలు అనుకుంటున్నారు. తెలంగాణలో పోలింగ్ రోజున భారీ వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ అంచనా వేయడంతో.. ఇది రాష్ట్రంలోని ఓటింగ్ శాతాన్ని ఎలా ప్రభావితం చేస్తుందోనని ఆందోళన నెలకొంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నాగర్కర్నూల్లో 33.7 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. హైదరాబాద్, ఖైరతాబాద్లో కూడా ఉష్ణోగ్రత 36.1 డిగ్రీల సెల్సియస్కు తగ్గింది.