న్యూ ఇయర్ వేడుకలు : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్నలు!
తెలంగాణలో కొత్త సంవత్సరం వేడుకలపై హైకోర్టు సీరియస్ అయింది. తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించింది. కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం ఎందుకు విధించలేదని ప్రశ్నించింది.;
తెలంగాణలో కొత్త సంవత్సరం వేడుకలపై హైకోర్టు సీరియస్ అయింది. తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించింది. కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం ఎందుకు విధించలేదని ప్రశ్నించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారించింది. కొత్త కరోనా ప్రమాదకరమంటూనే వేడుకలకు అనుమతి ఎలా ఇచ్చారని, బార్లు, పబ్బులకు అనుమతి ఎందుకిచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందని అడిగింది.
హైకోర్టు విచారణ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించింది. కొత్త రకం వైరస్ చాలా ప్రమాదకరమని ఒకవైపు వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ చెబుతుంటే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. బార్లు, పబ్లు విచ్చలవిడిగా తెరిచి ఉంచి ఏం చేయాలనుకుంటున్నారని నిలదీసింది. రాజస్థాన్, మహారాష్ట్రలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్యాన్ చేశారని తెలిపింది.
అటు కరోనాను దృష్టిలో పెట్టుకుని వేడుకలు జరుపుకోవద్దని ప్రజలకు సూచించామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ రోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం, మాస్క్లు తప్పకుండా వినియోగించాలని సూచించింది. వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదికను జనవరి 7న సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.