KALESHWARAM: "కాళేశ్వరం"పై సర్కార్ సంచలన నిర్ణయం
మూడు బ్యారేజీలకు మరమ్మతులకు నిర్ణయం.. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డలకు రిపేర్.. పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్ల పిలుపు
కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజిలను మరమత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది. NDSA కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు చేయనుంది. డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. . డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈవోఐ కోరింది. కాగా బ్యారేజీలను మరమ్మతు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్డీఎస్ఏ) తన రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగా పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం సంక్పల్పించింది. వరదల తర్వాత భూభౌతిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అదే సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కూడా బ్యారేజీ నిర్మిస్తామని ప్రభత్వం ఇప్పటికే ప్రకటించింది. NDSA కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు రుపొందించాల్సి ఉంటుంది.
పనులకు ఆటంకం
ప్రస్తుతం వరదల కారణంగా వర్షా కాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సమయం వృథా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకెళ్తోంది. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియ పూర్తయ్యేలోగా మిగిలిన పరీక్షలను పూర్తి చేయాలని భావిస్తోంది. తద్వారా అర్హత సాధించిన సంస్థలను సైతం ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వాములను చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టును నిన్నమొన్నటిదాక రాష్ట్రానికి గుదిబండ అని..ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ పాలకులు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ప్రాజెక్టు పునరుద్దరణకు నిర్ణయించడం చర్చనీయాంశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.