TS : మైనంపల్లిని మంత్రిని చేస్తాం.. రేవంత్ హాట్ కామెంట్

Update: 2024-04-29 08:10 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. తమ పోటీ అక్కడక్కడా బీజేపీతో మాత్రమే అంటున్నారు. మల్కాజ్‌గిరి కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్ఎస్‌ పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్‌ ఇప్పుడు చచ్చిన పాముతో సమానం అంటూ విమర్శించారు.

కారు కార్ఖానాకు పోయిందనీ.. ఇక కారు తిరిగి రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కారు కార్ఖానాకు పోయినందుకే కేసీఆర్ బస్సు ఎక్కి యాత్రలు చేస్తున్నారని అన్నారు. బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ సందు దొరికితే తనపైనే విమర్శలు చేస్తున్నారని.. పదేళ్లు తాను చేసింది చెప్పుకోవాలని అన్నారు.

నాలుగు నెలల్లో గ్యారంటీలు అమలుచేసిన కాంగ్రెస్ కు తిరుగులేని ప్రజాదరణ దక్కుతోందని చెప్పారు రేవంత్ రెడ్డి. రూ.500 కే గ్యాస్‌ సిలిండర్ అందించి సామాన్యులపై భారాన్ని దించామనీ.. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారిని ఆదుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతేకాకుండా మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించామని చెప్పారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్నారు. బీజేపీ ప్రచారాలు నమ్మొద్దని.. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తే మైనంపల్లిని మంత్రిని చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News