తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ పోస్టును.. ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో భర్తీ చేశారు. ఆయన తెలంగాణతో పాటు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా చార్జ్ తీసుకున్నారు.
బుధవారం ఉదయం రాజ్భవన్లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన యాదగిరిగుట్టకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు. ఆలయ అర్చకులు గవర్నర్కు వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత సాయంత్రం గవర్నర్ కుటుంబసమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడాన్ని హిందువులు, హిందూత్వవాదులు, బీజేపీ నేతలు సెంటిమెంట్ గా భావిస్తారు. స్థానిక ముస్లింలు కూడా అమ్మవారిపై భక్తి కనపరుస్తారు. శుక్రవారం నాడు అమ్మవారి డాలర్ కుంకుమను హిందు, ముస్లింలు భక్తితో స్వీకరిస్తుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని పాతబస్తీ భక్తులు చెబుతుంటారు.