కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు బెర్త్లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 4 భర్తీ చేయాలని భావిస్తున్నారట. అటు కొత్త పీసీసీ చీఫ్ రేసులో జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్, సంపత్ కుమార్, మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ ఉన్నట్లు సమాచారం. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ పార్టీని గెలిపించారు. ఆయనకు సీఎం పదవి వచ్చింది. ఇక పార్టీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించి వేరే వారికి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అది ప్రచారంగానే ఉంది. లోక్ సభ ఎన్నికలు అయిపోయాయి. ఈ నెల 27వ తేదీతో అంటే గురువారంతోనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడై 3 సంవత్సరాలు అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల ప్రకారం పీసీసీ చీఫ్ పదవికాలం 3 సంవత్సరాలు. ఆ తర్వాత కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. లేదా పొడిగించవచ్చు. అయితే, సీఎంగా, పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )… పీసీసీ చీఫ్ పోస్టును మరొక నేతకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు.