ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులపై పోలీసుల ఉక్కుపాదం!
రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో రెండు రోజుల క్రితం సునీల్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాప్ ద్వారా అప్పులు చేసి చెల్లించలేకపోయాడు.
ఆన్లైన్లో ఈజీగా లోన్లు ఇచ్చి వడ్డీలపై వడ్డీలతో జనం ఉసురుతీస్తున్న లోన్ యాప్స్ పై పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు పెరిగిపోవడంతో వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్న ఓ వ్యక్తిని సైబారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో రెండు రోజుల క్రితం సునీల్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాప్ ద్వారా అప్పులు చేసి చెల్లించలేకపోయాడు. దీంతో సునీల్ను యాప్ నిర్వాహకులు వేధించడం మొదలు పెట్టారు. కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వారివద్ద సునీల్ను తీవ్రంగా అవమాన పరిచారు. పరువుపోయిందని భావించిన సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సైబారాబాద్ పోలీసు ఓ యవకుడిని పట్టుకున్నారు. నిందితుడు నాలుగు యాప్లు సృష్టించి రుణాలు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ యువకుడిని రహస్యప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నారు. అతడి బ్యాంక్ ఖాతాల్లో నగదు నిల్వలను పరిశీలిస్తున్నారు.
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరు బయటికి చెప్పుకోలేక జేబులు గుల్ల చేసుకుంటున్నారు. స్వల్ప మొత్తంలోనే అప్పు తీసుకుంటున్నప్పటికీ 36 శాతానికి పైగా వడ్డీలు వసూలు చేస్తూ రుణగ్రహీతలను యాప్ నిర్వాహకులు తీవ్రంగా వేధిస్తున్నారు. సులువుగా రుణం దొరుకుతుందని ఆన్లైన్ లోన్ యాప్ల మాయాజాలంలో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వేధింపులు ఉంటే పోలీసులు ఆశ్రయించాలని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని సూచిస్తున్నారు.