Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు నూతన న్యాయమూర్తి..

Telangana High Court : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయభాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు.

Update: 2022-08-04 05:17 GMT

Telangana High Court : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయభాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. మరికాసేపట్లో జస్టిస్‌ విజయభాస్కర్‌రెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నియామకంతో తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 28కి చేరింది. గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.

జస్టిస్‌ చాడ విజయభాస్కర్‌ రెడ్డి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే అందులో 10 మందికి మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది.

న్యాయవాదుల కోటా నుంచి ఇద్దరికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. ఆ ఇద్దరిలో ఒకరైన జస్టిస్‌ చాడ విజయభాస్కర్‌రెడ్డి నియామకానికి నిన్న కేంద్రం ఆమోదం తెలిపింది.

1968లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాకలో విజయభాస్కర్‌రెడ్డి జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు.

ఎన్‌ఐఆర్డీ, చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, కేంద్ర ప్రభుత్వ అడిషనల్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు.

Tags:    

Similar News