TS : రాష్ట్ర చిహ్నం, గీతంపై నేడు సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష

Update: 2024-05-30 07:06 GMT

తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం, గీతం రూపకల్పన తుది దశకు చేరుకున్న నేపథ్యంలో నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతంపై ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ పార్టీలకు వివరించనున్నారు సీఎం రేవంత్. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల నేతలతో సచివాలయంలో సమావేశం కానున్నారు సీఎం రేవంత్. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్‌కు ఆహ్వానం పంపలేదని సమాచారం.

ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర చిహ్నం అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేసినట్లు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 నమూనాలను రుద్ర రాజేశం తయారు చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు. తుది రూపంపై బుధవారం కూడా కళాకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.

ఇక, తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. జయ జయహే తెలంగాణ గీతం రూపకల్పనపై బుధవారం సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణి బృందం పాడి వినిపించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందు కు భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News