ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇటీవల ముగిసిన దరఖాస్తుల గడువును 17వ తేదీ వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొన్నింటిని పరిష్కరించింది. పెండింగ్లో దరఖాస్తులు కూడా భారీగా ఉండటంతో పరిశీలన గడువును పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో అధికారులు అన్ని స్థాయుల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో రెండు లేదా మూడు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.