Telangana Assembly : నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా? రారా?
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్సభకు వస్తారా? రారా? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అధికార పక్షానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని.. ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇరుకునపెట్టాలని.. అసెంబ్లీలో ఇలాంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాలని కేసీఆర్ను ఆయన కోరుతున్నారు. సమావేశాల్లో రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గతంలో ఇద్దరు వరకు సంతానం ఉన్న వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీనిని సవరించి ముగ్గురు సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించనుంది.