ఓ ఫోటో దిగితే చాలు అనుకున్నాను .. కానీ ఇప్పుడు ఏకంగా.. !
చిన్నచిన్న సినిమాలకి మాటల రచయితగా కెరీర్ మొదలు పెట్టిన సాయిమాధవ్ బుర్రా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకి సంభాషణలు రాస్తున్నారు.;
లోతైన సన్నివేశాలకి పదునైన సంభాషణలు రాయడంలో రచయిత సాయిమాధవ్ బుర్రా దిట్టనే చెప్పాలి. చిన్నచిన్న సినిమాలకి మాటల రచయితగా కెరీర్ మొదలు పెట్టిన సాయిమాధవ్ బుర్రా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకి సంభాషణలు రాస్తున్నారు. తాజాగా ఆయన మరో పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకున్నాడు. తమిళ దర్శకుడు శంకర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్లో సాయిమాధవ్ బుర్రా ఇప్పుడు భాగం అయ్యారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''జెంటిల్ మేన్' సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను. ఈ అవకాశమిచ్చిన శంకర్, దిల్ రాజు, రామ్చరణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ సాయిమాధవ్ బుర్రా ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రానికి కూడా సాయిమాధవ్ బుర్రానే సంభాషణలు అందిస్తున్నారు.