టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ రాకెట్.. నటి అరెస్ట్
డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితోపాటు ఓ టాలీవుడ్ నటిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.;
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ బాగోతం వెలుగుచూసింది. ముంబై మీరా రోడ్డులోని ఓ హోటల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితోపాటు ఓ టాలీవుడ్ నటిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న చాంద్ మహ్మద్ వద్ద నుంచి 4 వందల గ్రాముల మెఫెడ్రోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ మార్కెట్లో 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని అంచనా.
డ్రగ్స్ సరఫరా చేసే సయ్యద్ పరారీలో ఉన్నట్టు ఎన్సీబీ అధికార వర్గాలు అంటున్నాయి. ఎన్సీబీ అరెస్టు చేసిన నటి తెలుగులో నాలుగు సినిమాల్లో నటించినట్టు సమాచారం. నటిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ లింక్లపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ నటిని ముంబైలోని ఎన్సీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ టాలీవుడ్ నటి ఎవరన్నది తెలియాల్సి ఉంది.
అటు బాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ.. ఎన్సీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యలో డ్రగ్స్ కోణం వెలుగు చూడటం అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొన్నాళ్ల విచారణ తర్వాత వారిద్దరూ ప్రస్తుతం బెయిల్పై విడుదలై బయటికొచ్చారు. డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకునే వంటి వారు ఎన్సీబీ అధికారులు విచారణ ఎదుర్కొన్నారు. ఆ కేసు విచారణలో ఉండగానే.. టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.