Virata Parvam: సంచలనమయిన విప్లవ గాయని కథే 'విరాటపర్వం'..! అందుకే రిలీజ్ ఆలస్యం..
Virata Parvam: రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘విరాటపర్వం’.
Virata Parvam: రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే 'విరాటపర్వం'. ఇది ఒక నక్సలైట్ బ్యాక్డ్రాప్లో సాగే కథ అని ఇప్పటికే మూవీ నుండి విడుదలయిన పోస్టర్స్, టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే విరాటపర్వం కథ కల్పితం కాదని.. ఇది ఒక విప్లవకారిణి కథ అన్న వార్త సంచలనంగా మారింది. ఇందులో సాయి పల్లవి పాత్ర ఆ విప్లవకారిణి జీవితానికి దగ్గరగా ఉంటుందని సమాచారం.
ఇప్పటికే విరాటపర్వం సినిమా విడుదల చాలా ఆలస్యమయ్యింది. దీని వల్ల మూవీ టీమ్పై ప్రేక్షకుల్లో ఎంతో నెగిటివిటీ కూడా వచ్చింది. అందుకే జూన్ 17న ఈ మూవీ విడుదల చేయాలని నిర్ణయించారు. ఇంతలోనే ఈ సినిమాపై ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ఇందులో సాయి పల్లవి.. అలనాటి విప్లవ గాయని బెల్లి లలిత పాత్రలో కనిపించనున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి.
1990ల్లో బెల్లి లలిత.. తన విప్లవ గీతాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. అలాంటి బెల్లి లలితను కొందరు దారుణంగా హత్య చేశారు. తన శరీరాన్ని ముక్కలు ముక్కులుగా నరికి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ప్రాంతంలో పడేశారు. అప్పట్లో తన హత్య ఒక సంచలనం. ఈ హత్య.. తనలాగా విప్లవ గీతాలు పాడాలి అనుకునే ఎంతోమంది గొంతులను మూగబోయేలా చేసింది.
విరాటపర్వంలో సాయి పల్లవి చేస్తున్న పాత్రకు, బెల్లి లలిత జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయని సమాచారం. అంతే కాకుండా నక్సలైట్గా నటిస్తున్న ప్రియమణి చేతిల్లోనే సాయి పల్లవి చనిపోతుందని కూడా ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే నిర్మాత సురేశ్ బాబు కథలో చాలా మార్పులు చేర్పులు చేయించి రీ షూట్ చేయించారట. అందుకే సినిమా రిలీజ్ కూడా వాయిదాలు పడుతూ వచ్చిందని సమాచారం.