ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ తొందరలోనే కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం సత్నాలోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జిల్లా ఆసుపత్రిలో శనివారం ఓ వ్యక్తి తన తాతను మోటార్సైకిల్పై నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకురావడం కలకలం రేపింది.
ఇదే హాస్పిటల్ లో ఆ వ్యక్తి అవుట్సోర్సింగ్ ఉద్యోగి. రోగి చార్ట్లను తయారు చేసే విధులు నిర్వర్తిస్తుంటాడు. జిల్లాలోని తికురియా తోలా నివాసి దీపక్ గుప్తా మరొక వ్యక్తితో కలిసి .. తన తాత మోతీ లాల్ గుప్తాను తన మోటార్సైకిల్ను నేరుగా ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి తీసుకువచ్చాడు. వెనుక కూర్చొన్న వ్యక్తి అక్కడి సిబ్బంది కలిసి అచేతనంగా ఉన్న ఆ వృద్ధుడ్ని బైక్ నుంచి కిందకు దించారు. ఆ తర్వాత అత్యవసర వైద్యం అందించారు.
ఈ వీడియో ఏఎన్ఐ ఏజెన్సీలో వచ్చింది. వైరల్ మారడంతో జనం ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారు. ఆసుపత్రిలో స్ట్రెచర్లు, ఇతర సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటి సాయం తీసుకోలేదు. ఈ విషయంపై ఆస్పత్రి యాజమాన్యం కిమ్మనడంలేదు. ఎనిమిది స్ట్రెచర్లు, ఆరు పని చేసే వీల్చైర్లు అన్ని సమయాల్లో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ఐనప్పటికీ ఆ ఉద్యోగి నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకురావడంపై విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.